
ఈ కమిషనర్ మాకొద్దు
● నెల్లిమర్ల కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం
● కమిషనర్ తారక్నాథ్ పనితీరు బాగోలేదని ధ్వజం
● ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ
● కమిషనర్ లంచం తీసుకున్నట్టు
సమావేశంలో పలువురి సాక్ష్యం
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. కమిషనర్ తారక్ నాథ్ తీరుతో తమకు చెడ్డపేరు వస్తోందని, ప్రతి పనికి లంచాలు తీసుకుంటున్నారని సమా వేశంలో సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తమకు వద్దని, వెంటనే ఇక్కడ నుంచి పంపించివేయాలని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సదరు తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కు పంపించాలని చైర్పర్సన్ సరోజినికి సూచించారు. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు.
కమిషనర్ తీరుపై మండిపాటు
కమిషనర్ తారక్నాథ్ తీరుపై సమావేశంలో మెజారిటీ సభ్యులు ధ్వజమెత్తారు. పట్టణంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని సభ్యులు చిక్కాల సంతోష్ కుమార్, లెంక హైమావతి, చిక్కాల సుమతి, అవనాపు సత్యనారాయణ తదితరులు విరుచుకుపడ్డారు. బైరెడ్డి సంతోష్ అనే వ్యక్తి నుంచి రూ.15 వేలు, ధనుంజయ్నాయుడు అనేవ్యక్తి నుంచి రూ.10 వేలు, ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. వారితో సమావేశంలో చెప్పించారు. ప్రతిరోజూ వార్డు పర్యటన పేరుతో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నట్లు ఆరోపించారు. సదరు యజమానులను సాయంత్రం వేళ కార్యాలయానికి రప్పించుకొని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులను కమిషనర్ చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయడానికి కమిషనర్కు అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. కమిషనర్ తప్పులు చేసి, ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు.
పలు తీర్మానాలకు ఆమోదం..
ఆశీళ్ల వసూలు చేసుకునే వేలం మొత్తం తగ్గించాలని సమావేశంలో తీర్మానించారు. జరజాపుపేటలో షాపు ల లీజుకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. కోటి రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు తిరిగి టెండర్లు పిలవాలనే తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. బైరెడ్డి సూర్యనారాయణ మున్సిపల్ కల్యాణ మండపాన్ని రూ.20 లక్షలతో అభివృద్ధి చేసేందుకు, పట్టణంలో ఉన్న 267 అక్రమ కుళాయి కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, కౌన్సిలర్లు చిక్కాల సంతోష్ కుమార్, మైపాడ ప్రసాద్, చిక్కాల సుమతి, జానా సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.