
ఉచిత హామీలతో కూటమి వెన్నుపోటు
● ప్రజలను ఆశపెట్టి మోసగించిన కూటమి ప్రభుత్వం
● హామీలు అమలుచేయాలన్న డిమాండ్తో ఈ నెల 4న ‘వెన్నుపోటు దినం’ నిర్వహణ
● అన్ని నియోజకవర్గాల్లో
విజయవంతంగా నిర్వహించాలి
● పార్టీ కార్యక్రమాల నిర్వహణలో పార్టీ మండలాధ్యక్షులదే కీలక పాత్ర
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
● పార్టీ మండల/నగర అధ్యక్షులతో సమీక్ష సమావేశం
విజయనగరం: కూటమి నేతలు ఎన్నికలకు ముందు ప్రజలను హమీలతో ఆశపెట్టి మోసగించారని, చెప్పిన వాగ్దానాలను అమలు చేయని మోసకారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన వెన్నుపోటు దినంను అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 4వ తేదీన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలు సాగుతాయన్నారు. విజయనగరం జిల్లాలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించి అధికార యంత్రాంగానికి ఎన్నికల హమీల అమలుపై వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని ధర్మపురి సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, పార్టీ మండల, నగరాధ్యక్షులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలే స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేస్తారన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రతినాయకుడు, కార్యకర్త ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.
పార్టీ మండలాధ్యక్షులదే కీలక పాత్ర...
ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీ పునఃనిర్మాణంలో పార్టీ మండల, నగర అధ్యక్షులు కీలక భూమిక పోషించాలని మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీను బలోపేతం చేయాలన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అధికారంలోకి వస్తే పార్టీ శ్రేణుల సూచనల మేరకు పాలన సాగిస్తామని అధినేత మాట ఇచ్చినట్లు చెప్పారు. ఇకపై నెలవారీ సమావేశంలో అధ్యక్షులంతా తమ సలహాలు, సూచనలు అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే సందర్బంలో మీమీ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాటాలకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
కార్యకర్తలకు మంచి చేసే ఆలోచనలో జగన్మోహన్రెడ్డి: కిల్లి సత్యనారాయణ
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు మంచి చేసే ఆలోచనలో ఉన్నారని, పార్టీ కోసం కష్టించిపని చేసే వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ చెప్పారు. అధికారంలోకి వస్తే పాలనలో మార్పు తీసుకువస్తామని హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఏ ప్రభుత్వంపై లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. కేంద్రం నుంచి రూ.లక్షలకోట్ల అప్పులు తేవడం మినహా హమీల అమలుపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని తూర్పారబట్టారు. పార్టీ నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని తూచాతప్పకుండా అమలు చేయడంలో మనమంతా సైనికుల్లా పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, శంబంగి వేణుగోపాలనాయుడు, సంగంరెడ్డి బంగారునాయుడు, అల్లాడ సీతారామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పార్టీ కమిటీల నియామకాలు..
పార్టీ ఆదేశాల మేరకు పార్టీ మండల కమిటీలు, జిల్లా అనుబంధ కమిటీలు, గ్రామ, వార్డుస్థాయి కమిటీలను నియమించే బాధ్యత పార్టీ మండలాధ్యక్షులదేనని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పార్టీ 26 జిల్లా అనుబంధ కమిటీల్లో చురుకై న వారికి స్థానం కల్పించాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అనుబంధ కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తారని, వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. త్వరలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ అధిక సమయం క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు.