
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
● డీఐఐపీసీ సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు, యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామికవాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్దద కూడా దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాల పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో ఏపీఐఐసీకి ఇప్పటి వరకు సుమారు 2,400 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ వాటిలో కేవలం 300 పైచిలుకు ఎకరాలను మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భూముల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జీఎం శ్రీధర్, ఏడీ రామకృష్ణ, విజయనగరం ఆర్డీఓ టి.సవరమ్మ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జంఝావతి ఆయకట్టుదారుల గోడువినండి బాబూ..
● జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు
● తక్షణమే ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్
కొమరాడ: జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు డిమాండ్ చేశారు. ఆయకట్టు రైతులు, సమితి సభ్యులతో కలిసి జంఘావతి రబ్బరు డ్యామ్ వద్ద శుక్రవారం పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం పూర్తయిన రబ్బర్డ్యాం వల్ల సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్రా జెక్టు పూర్తిచేస్తే మరో 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఒడిశాతో ఉన్న వివాదం పరిష్కారం కాక ప్రాజెక్టు పూర్తికావడం లేదన్నారు. ప్రస్తుతం ఒడిశా, ఆంధ్రపదేశ్లో కూటమి ప్రభుత్వమే ఉందని, నాయకులు దృష్టిసారిస్తే ప్రాజెక్టు సమస్య కు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ దిశగా స్థానిక కూటమి నాయకులు ప్ర భుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లోని భూములకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఎం.మాలతీకృష్ణమూర్తి నాయుడు, వి.దాలినాయుడు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు.

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు