డబ్బులివ్వక పోతే ఖబడ్దార్‌..! | - | Sakshi
Sakshi News home page

డబ్బులివ్వక పోతే ఖబడ్దార్‌..!

Jun 4 2025 1:25 AM | Updated on Jun 4 2025 1:25 AM

డబ్బులివ్వక పోతే ఖబడ్దార్‌..!

డబ్బులివ్వక పోతే ఖబడ్దార్‌..!

● డబ్బుల కోసం బాలికకు యువకుడి వేధింపులు ● ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో అసభ్యకర పోస్టులు ● నిందితుడిపై కేసుల నమోదు, రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ భవ్యారెడ్డి

రామభద్రపురం: రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నా..చదువుకున్న వారు కూడా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతుడండం, సైబర్‌ నేరగాళ్లు కూడా రకరకాల యాప్‌ల ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.అక్రమంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెట్టి డబ్బులు ఇవ్వాలంటూ ఓ ఆడపిల్లను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ నిందితుడు పోలీసులకు మంగళవారం చిక్కాడు. ఈ సంఘటనపై డీఎస్పీ భవ్యారెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మెరకముడిదాం మండలం భైరిపురంగ్రామానికి చెందిన ఓ యువకుడు ఒడిశాలో ఐటీఐ చదువుతున్నాడు. అక్కడ ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ఓపెన్‌ చేసి అందులో ఆడపిల్లల ఫోటోలు పెట్టి లైక్‌లు కొట్టమని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టేవాడు. ఈ క్రమంలో రామభద్రపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్నేహితురాలి ఫొటో మార్ఫింగ్‌ చేసి, ఇన్‌స్ట్రాగామ్‌ యాప్‌లో పెట్టి ప్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టగా రామభద్రపురం గ్రామానికి చెందిన బాలిక తన స్నేహితురాలే కదా అని లైక్‌ కొట్టింది. దీంతో ఆ కుర్రాడు ఆ ఇన్‌స్ట్రాగామ్‌ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ అయిన బాలిక ఫొటోలు స్క్రీన్‌షాట్‌ తీశాడు.ఆ ఫొటోలను వాడి మొబైల్‌ ఫోన్‌లోనే నగ్నంగా మార్ఫింగ్‌ చేసి ఉంచుకున్నాడు. ఇవేవీ అ బాలికకు తెలియదు. బాలిక స్నేహితురాలు అడిగినట్లుగానే నాకు అవసరం ఉంది ఓ రూ.500 కావాలని అడిగాడు. ఆమె తన దగ్గర లేవని సమాధానం ఇచ్చింది. దీంఓ వెంటనే ఆ మోసగాడు నగ్నంగా..అసభ్యకరమైన ఉన్న ఫొటోలు ఆమెకు పంపించి నీవు అర్జెంటుగా రూ.8 వేలు ఇవ్వకుంటే ఈ ఫొటోలు సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌లలో పెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు.

పోలీసులను ఆశ్రయించిన బాధిత బాలిక

దీంతో ఆ బాలిక నీవు అలా చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై స్థానిక పోలీసులను ఆశ్రయించారు.ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదేశాల మేరకు సీఐ కె నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులు మే 2వ తేదీన కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి సైబర్‌ మోసానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేసి, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ నేరం, పోక్సో కింద నిందితుడిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మొబైల్‌కు వచ్చే లింక్‌లు క్లిక్‌ చేయొద్దని,సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్లు మంచి కోసం ఉపయోగించాలని, ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌లు ఖాతాలు ఓపెన్‌ చేయడం ఆడపిల్లలకు అవసరం లేదన్నారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ ఫోటోలను చూసి అకర్షణకు లోనై మోసపోకూడదని హితవు పలికారు. వేగంగా కేసును ఛేజ్‌ చేసిన సీఐ నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement