
కార్మిక శాఖ సహాయ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
విజయనగరం గంటస్తంభం: విజయనగరం కార్మికశాఖ సహాయ నూతన కమిషనర్గా జి.ఎల్లాజీ రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఏటీ శ్రీనివాసులు నుంచి ఉదయం 10 గంటలకు బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరారు. అనంతరం కార్మిక శాఖ కార్యాల యంలో కార్మిక శాఖ ఉప కమిషనర్, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తులసిరామినాయుడువలసలో ఏనుగులు
గరుగుబిల్లి: పదిరోజుల నుంచి మండలంలోని సుంకి, సంతోషపురం, గొట్టివలస తదితర గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులు గడిచిన రెండు రోజుల నుంచి తులసిరామినాయుడు వలస, దళాయివలస గ్రామాల్లో సంచరిస్తున్నాయి. మంగళవారం పార్వతీపురం–గరుగుబిల్లి ఆర్అండ్బీ ప్రధాన రహదారి పరిధిలో ఏనుగులు సంచరిస్తుండడంతో రాకపోకలు చేసేందుకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంట పొలాల్లో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ సోమవారం తెలిపారు. మండలానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా పలుమార్లు శారీరకంగా అనుభవించాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందివలస వాసు అనే వ్యక్తిపై పోక్సోతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. ఈ నేపథ్యంలతో డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామని ఎస్సై చెప్పారు.
ఆకస్మికంగా సబ్జైల్ తనిఖీ
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఉన్న సబ్జైలును విజయనగరం జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో వసతులను ఈ సందర్భంగా పరిశీలించి ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి అక్కడి పరిస్థితుల పట్ల ఆరాతీశారు. నిబంధనల ప్రకారం చక్కటి నడవడిక, నైతిక విలువల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఖైదీలకు సూచించారు. ఖైదీల ఆరోగ్యంపట్ల తీసుకుంటున్న చర్యలపై సబ్సైల్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. పలు విభాగాలను తనిఖీ చేసి ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ గురించి ఖైదీలకు వివరించారు. ఒక ఆడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సలహాలను అందిస్తారని చెప్పారు. ఖైదీలు సత్ప్రవర్తనతో తమకు విధించిన శిక్షను పూర్తిచేసుకోవాలని సూచించారు. న్యాయవాదులు లేని ఖైదీలకు ఉచితంగా నియమించనున్నట్లు తెలిపారు. 70ఏళ్లు పైబడిన వారికి, అలాగే అనారోగ్యంతో బాధ పడేవారికి బెయిల్ మంజూర య్యేలా కృషిచేస్తామన్నారు. ఈ పరిశీలనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎస్. దామోదరరావు, లోక్ అదాలత్ సభ్యుడు టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.
రేషన్కు వెళ్తూ ప్రమాదానికి గురైన వ్యక్తి
రాజాం సిటీ: కూటమి ప్రభుత్వం రేషన్ విషయంలో అవలంబించిన విధానంతో రాజాంలోని ఓ వ్యక్తి మంగళవారం ప్రమాదం బారినపడి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించి టౌన్ సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు మెంటిపేట ఎస్సీ కాలనీకి చెందిన రాగోలు విశ్వనాథం రేషన్ సరుకులు విడిపించేందుకు మల్లయ్యపేటలోని డిపోకు సైకిల్పై వస్తున్నాడు. సిరి కల్యాణమంటపం వద్దకు వచ్చేసరికి అదే సమయంలో బొబ్బిలి నుంచి వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. దీంతో రోడ్డుపై పడిపోయిన విశ్వనాథం తల, కాలికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 ద్వారా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

కార్మిక శాఖ సహాయ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

కార్మిక శాఖ సహాయ కమిషనర్ బాధ్యతల స్వీకరణ