
వైద్యసిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం ఫోర్ట్:
వివిధ కారణాలతో ప్రసవ సమయంలో, ప్రసవానంతరం గర్భిణులు, శిశువులు మృతి చెందడం పట్ల కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నవంబర్ 24 నుంచి మార్చి 2025 వరకు జిల్లాలో సంభవించిన నాలుగు మాతృమరణాలు, ఐదు శిశు మరణాలపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలు, సిబ్బంది లేకపోవడం వల్ల, వైద్యుల నిర్లక్ష్యం, ఏ స్థాయిలో తప్పిదం జరిగి ఉంటుంది తదితర కారణాలపై ఆరా తీశారు. వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశ, ఏఎన్ఎంలను ప్రశ్నించారు. అన్ని రికార్డులను సమర్పించాలని ఆదేశించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపై మండిపడ్డారు. గర్భిణులు వెంపడాపు లీలావతి, బంగారి సుధ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కొరమ దుర్గ మృతి విషయంలో పీజీ స్టార్ ఆస్పత్రికి నోటీస్ ఇవ్వాలని, అలాగే మరో మృతికి సంబంధించి సమావేశానికి కేజీహెచ్ వైద్యులు రాకపోవడంతో కేజీహెచ్ సూపరింటెండెంట్కు కూడా లెటర్ రాయాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పొంతన లేని నివేదికలు
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది ఇస్తున్న నివేదికలు పొంతన లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో ఇరు శాఖల అధికారులు నెలకోసారైనా సమావేశమై చర్చించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీరాణి, ఘోషాఆస్పత్రి గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ అరుణశుభశ్రీ, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
గర్భిణుల మృతిపట్ల సమగ్ర దర్యాప్తు
చేయాలని ఆదేశాలు