
సామాజిక అధ్యయనం సర్వే అడ్డగింత
వేపాడ: మారిక గిరిజన గ్రామాన్ని, భూములను అదానీ కంపెనీకి అప్పగించవద్దంటూ 35 రోజులుగా సచివాలయం నుంచి కలెక్టర్ వరకు విన్నపాలు చేసుకున్నప్పటికీ సామాజిక అధ్యయనం సర్వే అధికారులను ప్రభుత్వం పంపడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వేపాడ మండలంలోని కరకవలస గిరిశిఖర మారిక గ్రామాన్ని, భూములను సామాజిక అధ్యయనం చేసేందుకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తుతో.. మండలస్థాయి అధికారులు తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణతో కలిసి వెళ్లిన అధికారులను మారిక పొలిమేరలోనే గిరిజనులు అడ్డుకుని వెనక్కి పంపారు. మా పొలాలను గ్రామాన్ని అదానీ కంపెనీకి ఇచ్చే ప్రసక్తి లేదంటు తెగేసి చెప్పారు. మండలస్థాయి అధికారులు ఎంత నచ్చచెప్పినప్పటికీ గిరిజనులు పట్టు వీడకపోవటంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. కార్యక్రమంలో మారిక గ్రామనాయకులు జలారి వీర్రాజు, బాబూరావు, అప్పలనాయుడు, సోమేష్, శ్రీను ఆసు, శోభన్బాబు, తదితర గిరిజనులు యువత, మహిళలు పాల్గొన్నారు,
హెడ్రా పవర్ ప్రాజెక్టు భూసేకరణపై ప్రకటన
మండలంలో కరకవలస పంచాయతీ గిరిశిఖర మారిక కొండపై రైవాడ ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ హెడ్రా పవర్ ప్రాజెక్టు భూసేకరణపై ఎస్ఐఏ అధికారుల పర్యవేక్షణకు బుధవారం శ్రీకారం చుట్టామని సామాజిక ప్రభావ అంచనా నివేదిక సామాజిక నిపుణుడు పి.దేవరాజు ఒక ప్రకటనలో పేర్కోన్నారు. బుధవారం సుమారు 8 కి.మీ కాలినడకన మారిక వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినట్లు తెలిపారు. భూసేకరణ చట్టం 2013పై గిరిజనులకు వివరించి సామాజిక ఆర్థిక, సాంఘిక సర్వేకు సహకరించాలని కోరామన్నారు. అయితే ఈ ఇన్స్పెక్షన్లో నిర్వాసితులు, పెద్దలు, ఎస్ఐఏ బృందం సభ్యులు, మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓను అడ్డగించారని తెలిపారు. గిరిజనుల అభిప్రాయాలను తమనివేదికలో కలెక్టర్కు నివేదిస్తామన్నారు.
అధికారులను తిప్పి పంపిన గిరిజనులు