
ఆరోగ్యశ్రీ రోగులకు.. సాధారణ భోజనం..!
విజయనగరం ఫోర్ట్:
కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్నే కాదు.. ఆరోగ్య సేవలపైనా కినుక వహిస్తోంది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద వైద్యసేవలు పొందుతున్న రోగులకు సరైన భోజనం అందకపోయినా పట్టించుకోవడం లేదు. రోగులు, వారి బంధువుల గోడు వినిపించుకోవడం లేదు. వాస్తవంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందేవారికి రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. దీనికోసం రోజుకు రూ.100లు ఖర్చుచేయాలి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ రోగులకిచ్చే భోజనమే ఆరోగ్యశ్రీ రోగులకూ అందిస్తున్నారు. దీనిపై రోగుల బంధువులు నిలదీస్తున్నా స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సైతం ఆరోగ్యశ్రీ రోగులకు సాధారణ రోగులకు అందించిన భోజనం( డైట్) అందిస్తున్నారు. ఇక్కడ 450 నుంచి 500 మంది వరకు ఇన్పేషేంట్లుగా చికిత్స పొందుతారు. ఇందులో 300 నుంచి 350 మంది వరకు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందినవారే ఉంటారు. వీరికి ప్రత్యేకమైన భోజనం అందించాలి. ఆస్పత్రిలో మాత్రం ఇది అమలుకావడం లేదు. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలను 25 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు, 55 ప్రభుత్వాస్పత్రులు అందిస్తున్నాయి. చాలా చోట్ల భోజనం అందించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆదేశాలు వచ్చాయి..
ఆరోగ్యశ్రీ రోగులకు, సాధారణ రోగులకు ఒకే విధమైన డైట్ పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ రోగులకు రోజుకి రూ.100 చొప్పున 10 రోజులకి మించకుండా డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు వచ్చినా అమలు చేయలేదు.
– డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
భోజనానికి రూ.100 ఖర్చుచేయాలి
ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్వైద్యసేవ) పథకం కింద చికిత్స పొందిన రోగులకు భోజనం కోసం రోజుకు రూ.100 వెచ్చించాల్సిందే. రోగులకు రుచికరమైన భోజనం వడ్డించాలి. ఇందులో నిర్లక్ష్యం పనికిరాదు.
– డాక్టర్ సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్
రోగులకు
అందించే భోజనం
అందించాల్సిన మెనూ ఇదీ..
సాధారణ రోగులకు ఇస్తున్న భోజనమే ఆరోగ్యశ్రీ రోగులకు ఇస్తున్న వైనం
ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు పొందే వారికి భోజనం నిమత్తం రోజుకి రూ.100 చొప్పున వెచ్చించాలి
అమలు కావడం లేదంటూ ఆరోపణ
ఆవేదనలో రోగులు, వారి బంధువులు
ఆరోగ్యశ్రీ పథక నిబంధనల ప్రకారం రోగులకు ఉదయం 150 గ్రాముల బరువు ఉన్న మూడు ఇడ్లీలు, 100 గ్రాముల సెట్నీ... మిల్క్ బ్రెడ్ ఏడు సైల్స్ ఉన్నవి (140 గ్రాములు)... బన్సీ రవ్వ ఉప్మా 300 గ్రాములు వీటిల్లో ఏదో ఒకటి పెట్టాలి. అలాగే, 150 ఎంఎల్ పాలు ఇవ్వాలి. మధ్యాహ్నం మూడు పుల్కాలు (ఒక్కొక్కటి 30 గ్రాముల బరువు ఉండాలి)గాని, 450 గ్రాముల సోనామసూరి రైస్తో వండిన అన్నం, వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (30 గ్రాములు కందిపప్పు ఉండాలి), 50 గ్రాముల గల ఉడికించిన గుడ్డు, 100 గ్రాముల పెరుగు, అరటి పండు ఒకటి, లేదంటే సీజనల్గా దొరికే పండు ఇవ్వాలి. రాత్రికి 3 పుల్కాలు (30 గ్రాములు బరువు ఉండేవి) గాని, సోనామసూరి రైస్తో వండిన 450 గ్రాముల అన్నం, మిక్స్ డ్ వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (కంది పప్పు 30 గ్రాములు ఉండాలి), 50 గ్రాముల ఉడికించిన గుడ్డు ఒకటి, 150 గ్రాముల పాలు రెండు టీ స్పూన్ల పంచదారతో కలిపి ఇవ్వాలి. అయితే, చాలా చోట్ల మెనూ అమలుకావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరోగ్యశ్రీ రోగులకు.. సాధారణ భోజనం..!