
ఆధిపత్యం చెలాయిస్తున్నారు...!
నెల్లిమర్ల: కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని తెలిపారు. స్థానిక బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు పాలనా విషయాల్లో తలదూర్చి తనను పూర్తిగా నియంత్రించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జనసేన పార్టీలోకి మారిన తర్వాత కూటమి పార్టీకి చెందిన ఇంకో వ్యక్తి తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశాలను సభ్యుల సూచనల మేరకే తాను ఆమోదిస్తానని చైర్పర్సన్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ప్రవేశపెట్టిన కల్యాణ మండపం విస్తరణ, పార్కు ప్రహారీ నిర్మాణం వంటి అంశాలను మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో తాను కూడా తిరస్కరించినట్లు వివరించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు కలిసి తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోందని, కూటమి ప్రభుత్వంలోని తనపై కూటమిలోని వేరే పార్టీ ఎలా అవిశ్వాసం పెడుతుందని సరోజిని ప్రశ్నించారు. పలు విషయాల్లో కమిషనర్తో తాను కుమ్మక్కయ్యానన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జనసేన పార్టీ నాయకులు అప్పికొండ రవికుమార్, రవ్వా నాని, పాండ్రంకి సత్యనారాయణ మాట్లాడుతూ చైర్పర్సన్కు సంబంధించి ఏవైనా లోపాలుంటే టీడీపీ నాయకులు, సభ్యులు జనసేన పార్టీ దృష్టికి తీసుకు రావాలని, అంతేగాని కౌన్సిల్ సమావేశాల్లో ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. అలాగే చైర్పర్సన్ పిలుపునిచ్చిన సమావేశానికి ఎలా గైర్హాజరు అవుతారని ప్రశ్నించారు. కాలువలపై అక్రమణలు తొలగించి పట్టణాన్ని అభివృద్ధి చేసే చర్యలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. పట్టణాభివృద్ధికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశాలతో కూటమి పార్టీలకు చెందిన నాయకులతో కలసి నడవాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, బంగారు భానుప్రకాష్, బంగారు శంకరరావు, పలిశెట్టి దొరబాబు, సారిపల్లి శంకరరావు, పళని తదితరులు పాల్గొన్నారు.
నగర పంచాయతీ చైర్పర్సన్ సరోజిని