తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల కాలానికి గాను ఐఐఎంవీ అక్రిడిటేషన్ను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావాన్ని గుర్తించే ఈ అక్రిడిటేషన్ను పొందిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో ఐఐఎంవీ ఒకటిగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, నిరంతర అభివృద్ధి అనేవి తమ సంస్థ మూల విలువలని, ఈ అక్రిడిటేషన్ వాటిని మరింత ప్రతిబింబిస్తోందన్నారు. ఈ గుర్తింపుతో గ్లోబల్ స్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తద్వారా విదేశీ భాగస్వామ్యాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిశోధనలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


