బీచ్రోడ్డు : ప్రభుత్వ చర్యలతో ఏడు నెలల క్రితం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫుడ్ కోర్ట్ వ్యాపారులు గురువారం ‘వంటా–వార్పు’ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొని నడిరోడ్డుపై కూర్చొని భోజనం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చిరు వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు గురువారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్ మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 19న మహిళా కళాశాల ఎదురుగా ఉన్న నైట్ ఫుడ్ కోర్టును జీవీఎంసీ అధికారులు తొలగించడంతో తమతో పాటు అనేక మంది స్ట్రీట్ వెండర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే ముగ్గురు ఫుడ్ కోర్ట్ వ్యాపారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ ఫుడ్ కోర్టును తిరిగి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, నెలలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. తొలగించిన షాపులను యథాస్థానంలోనే తిరిగి ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో అసోసియేషన్ మరో అధ్యక్షుడు ఎం. ప్రసాద్, కార్యదర్శి ఎం. లలిత కుమారి, సభ్యులు దుంగ శ్రీను, బొగ్గు శ్యామ్, లక్ష్మి తదితరులు, పెద్ద సంఖ్యలో ఫుడ్ కోర్ట్ వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.


