సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన డీవీ సుబ్బారావు రెండో జాతీయ మధ్యవర్తిత్వ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి 23 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో ముంబైకి చెందిన మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా ఆవిర్భవించగా, ఒడిశా నేషనల్ లా యూనివర్సిటీ జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ చల్లా గుణరంజన్, ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చల్లా గుణరంజన్ మాట్లాడుతూ తమ విద్యార్థి దశలో ఇలాంటి ప్రాక్టికల్ పోటీలు లేవని, ప్రస్తుతం లభిస్తున్న ఇటువంటి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జస్టిస్ న్యాయపతి విజయ్ మాట్లాడుతూ ఈ తరహా పోటీలు న్యాయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు మాట్లాడు తూ, ప్రముఖ న్యాయవాది, మాజీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ డీవీ సుబ్బారావు పేరుతో ఈ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాథ్ మదాసు, ఫ్యాకల్టీ కన్వీనర్ డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు.


