ఏయూక్యాంపస్: మాదక ద్రవ్యాల రహిత విశాఖను నిర్మించడమే లక్ష్యంగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్డులో 5కే రన్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, నేవీ అధికారి సంజీవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ మాఫియాకు బలైన డీవైఎఫ్ఐ నాయకుడు పెంచలయ్య స్ఫూర్తితో ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతే లక్ష్యంగా సాగుతున్న ఈ మాఫియా వల్ల అనేకమంది తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ముఖ్యంగా యువతులకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఇటువంటి సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గంజాయి లేని విశాఖను నిర్మించుకుందాం.. యువతరాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో మున్ముందు కూడా పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయ్, వెంకటరమణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, మహేష్తో పాటు కుసుమాంజలి, కౌశిక్, మౌనిక, నరేష్, సంజయ్, ప్రసాద్, రాజా, శ్రీను తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


