మహారాణిపేట: గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఎ కేసులు నమోదు చేశారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో బర్మా క్యాంప్, కప్పరాడ, కంచరపాలెం ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో వ్యాపారుల నుంచి 21 సిలిండర్లు స్వాధీనం చేసుకుని, సంబంధితులపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్వో భాస్కరరావు తెలిపారు. గృహ అవసరాలకు కేటాయించిన గ్యాస్ను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలోని హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడుల్లో ఎఎస్వో శ్రీహరి, చెకింగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
హెల్ప్లైన్ నంబర్లు
వంట గ్యాస్ దుర్వినియోగంపై ఫిర్యాదుల కోసం ప్రజలు ఈ కింది హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
హెచ్పీసీఎల్(హెచ్పీ) 18002333555
బీపీసీఎల్ (భారత్) 1800224344
ఐవోసీఎల్(ఇండియన్) 18002333555
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2590102


