మహారాణిపేట: పెన్షనర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 25న అమలులోకి తెచ్చిన పెన్షన్ వాలిడేషన్ చట్టం–2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకత తెలుపుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్లు బ్లాక్ డే పాటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. పెన్షనర్ల ప్రయోజనాలను కాలరాసే ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలో వెచ్చించిన ఉద్యోగికి పెన్షన్ పొందడం అనేది ఒక గౌరవప్రదమైన హక్కు అని, అది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని అన్నారు. గతంలో డి.ఎస్.నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి రాసిన వినతిపత్రాన్ని ఇన్చార్జి డీఆర్వో శేష శైలజకు అందజేశారు. జిల్లా సంఘం అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆర్.కృష్ణ కుమార్, కోఆర్డినేటర్లు ఎన్.రవికుమార్, ప్రమీల, మోహన కుమారి, ఉమా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట
పీఆర్ విశ్రాంత ఉద్యోగుల నిరసన


