డాబాగార్డెన్స్ : సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సేవలు అందిస్తూ దేశ ప్రగతికి సోపానాలుగా నిలవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఆదివారం ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిష్ణాతులకు ‘విశ్వగురు’ అవార్డులను ఘనంగా ప్రదానం చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ సేవ చేసే గుణం ఉన్నవారే సమాజంలో శాశ్వత కీర్తిని పొందుతారన్నారు. ముక్కుతో బొమ్మలు వేసే అరుదైన ప్రతిభ కలిగిన సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కస్టమ్స్ అధికారి రవిశంకర్ మలిశెట్టి, సినీ నటుడు రాజీవ్ కనకాల, తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మిడి రామ్ కుమార్ మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతల సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సంస్థ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా క్షేత్రస్థాయిలో నిజమైన సేవకులను గుర్తించి గౌరవిస్తున్నామని, గతంలో తమ అవార్డులు అందుకున్న వారు పద్మ పురస్కారాలకు సైతం ఎంపిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, డాక్టర్ కిషోర్ కుమార్ సహా పలువురు కవులు, కళాకారులు, ఉన్నతాధికారులు పురస్కారాలు అందుకున్నారు.


