మహారాణిపేట : నగరంలోని గ్యాస్ ఏజెన్సీలను జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాణిపేట పరిధిలోని రఘురామ్ గ్యాస్ ఏజెన్సీ, ఎం.అప్లాండ్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలతో పాటు వాటి గోదాములను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురామ్ గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన వినియోగదారులతో జేసీ మాట్లాడారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? సిలిండర్లు సకాలంలో అందుతున్నాయా? అని అడిగి తెలుసుకోగా.. తమకు ఎలాంటి సమస్యలు లేవని వారు బదులిచ్చారు. అనంతరం ఏజెన్సీల్లోని ఆన్లైన్ రికార్డులు, కంప్యూటర్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన జేసీ.. ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా అనే కోణంలో ఆరా తీశారు. అప్లాండ్ గ్యాస్ ఏజెన్సీగోదాముల్లో ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, భద్రతా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిలిండర్ల నిల్వ విషయంలో కచ్చితంగా భద్రతా నిబంధనలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా సరఫరా అధికారి (డీఎస్ఓ) వి.భాస్కరరావు, లీగల్ మెట్రోలజీ డిప్యూటీ కంట్రోలర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


