సింహాచలం: ఉగాదిని పురస్కరించుకుని సింహగిరిపై చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉగాది రోజున 6(ఎ) కేటగిరీకి చెందిన ప్రధాన ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు.. గురువారం సింహాచలం దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరిపారు. ఆలయ కల్యాణమండపంలో చిన్నారులను వరుసగా కూర్చోబెట్టారు. స్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిల వద్ద పూజలో ఉంచిన పలకలను, బలపాలను చిన్నారులకు ఉచితంగా అందజేశారు. అనంతరం అర్చకులు చిన్నారుల చేత అక్షరాలు దిద్దించి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. తదనంతరం వారందరికీ స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఉప ప్రధానార్చకులు సాతులూరి నరసింహాచార్యులు, ఏఈవోలు ఎస్.రాధ, తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


