సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి శాశ్వత అన్నప్రసాద పథకానికి నగరానికి చెందిన నారాయణ సేవా దళం స్వచ్ఛంద సంస్థ విరాళాన్ని అందజేసింది. గురువారం దేవస్థానం కార్యాలయంలో సంస్థ సభ్యులు రూ.3,66,111 విరాళానికి సంబంధించిన చెక్కును సింహాచలం ఈవో జె.వెంకటరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భక్తులు అందజేసే ఇటువంటి విరాళాలు అన్నప్రసాద పథకాన్ని మరింత విస్తృతంగా నిర్వహించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. విరాళం అందజేసిన వారిలో నారాయణ సేవా దళం సభ్యులు పవన్కుమార్, రామచంద్రమూర్తి, లక్ష్మి, భారతి, అప్పలరాజు, రాంబాబు, ఉమ, కాసు శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.
రేపు పద్మనాభ రెడ్డి స్మారక న్యాయ సదస్సు
విశాఖలీగల్ : న్యాయకోవిదుడు, సీనియర్ న్యాయవాది దివంగత సి.పద్మనాభరెడ్డి స్మారక న్యాయసదస్సు ఈనెల 21న నిర్వహించనున్నట్టు భారత న్యాయవాదుల సమాఖ్య జాతీయ కార్యదర్శి కె.ఎస్.సురేష్ కుమార్, నగర కమిటీ కార్యదర్శి జహారా తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని నూతన భవనంలో శనివారం సాయంత్రం 5 గంటలకు న్యాయసదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాధ్ రాయ్ ముఖ్యఅతిథిగాను, జస్టిస్ చీమలపాటి రవి, తెలంగాణా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రాజు, న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్కుమార్, ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు హాజరవుతారని తెలిపారు.


