నగర అభివృద్ధిపై శ్రద్ధ ఏదీ?
రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం పదే పదే వల్లె వేస్తోంది. కానీ, నిధుల కేటాయింపు విషయానికి వచ్చే సరికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడుతోంది. తాజాగా విజయవాడ, విశాఖ మెట్రోలకు కలిపి బడ్జెట్లో కేవలం రూ.15.50 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇంకా ఆమోదం కూడా లభించలేదు. కానీ, ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు ప్రత్యేక కేటాయింపులు జరపకుండా.. అనుమతులు లేని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులు విదిల్చడం విశాఖపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేదాకా విశాఖ మెట్రో పనుల్లో కదలిక ఉండదనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. సిటీస్ ప్రాజెక్టు కింద ఒక కోటి రూపాయలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మరో కోటి రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. నగర అభివృద్ధి కోసం ఇలా కేవలం రూ.2 కోట్లు విదిల్చిన ప్రభుత్వం.. మరో చేత్తో ఏకంగా రూ. 22 కోట్లకు పైగా నిధులను కాజేస్తోంది. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్లో పలు అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీ నిధులపై ప్రభుత్వం కన్నేసింది. ఈ పనుల కోసం ఏకంగా రూ. 22.28 కోట్లు జీవీఎంసీ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కంటే జీవీఎంసీపై పడుతున్న అదనపు భారమే ఎక్కువగా ఉండటం గమనార్హం.


