పేదలకు ఒక న్యాయం.. పెత్తందార్లకు మరో న్యాయమా?
తగరపువలస: బీచ్రోడ్డులోని గీతం విశ్వవిద్యాలయం సుమారు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, దీనిపై ప్రజాప్రతినిధిగా ఎంపీ శ్రీభరత్ విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన భీమిలిలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి, వాటిని రక్షించుకోవడానికే శ్రీభరత్ ఎంపీగా ప్రజల ముందుకు వచ్చా రని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా గీతం సంస్థ ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు ఇప్పటికే పలువురు విశ్రాంత అధికారులు నిర్ధారించారని గుర్తు చేశారు. ఇటీవల జీవీఎంసీ పరిధిలో వందలాది మంది చిరు వ్యాపారుల దుకాణాలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలకు బంధువు అయినందునే.. ఎంపీ శ్రీభరత్ ఆధీనంలో ఉన్న ఆక్రమిత ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ పేరుతో వారికి శాశ్వతంగా కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఒక న్యాయం, డబ్బున్న వారికి మరొక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములను బడాబాబులకు ధారాదత్తం చేసే దుస్సంప్రదాయాన్ని చంద్రబాబు విడనాడాలని హితవు పలికారు.


