క్లిక్..ఆర్డర్
స్మార్ట్ షాపింగ్లో స్టైల్దే అగ్రస్థానం
సాక్షి, విశాఖపట్నం: ఫంక్షన్కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..!
ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..!
రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్
క్విక్ కామర్స్లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్స్టామార్ట్లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు. 2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించిందని సర్వేలో వెల్లడించింది.
సెకనుకు 4 పాల ప్యాకెట్లు
దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్ని ఇంటికి రప్పించుకుంటున్నారు.
● విశాఖలో 434 శాతం పెరిగిన బ్యాగులు, వాలెట్ల విక్రయాలు
● ఐఫోన్ నుంచి గోల్డ్ కాయిన్ దాకా.. ఫాస్ట్ షాపింగ్
● ఆన్లైన్ కొనుగోళ్లలో కిరాణేతర వస్తువులదే హవా
● ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడి
ఏం ఆర్డర్ చేస్తున్నారంటే?
ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది.
ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు 434 శాతం పెరిగాయి.
క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు 374 శాతం మేర నమోదయ్యాయి.
నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు 249 శాతం వృద్ధి చెందాయి.
ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 161 శాతం, పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు 166 శాతం పెరిగాయి.
స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు 100 శాతం వరకు వృద్ధి చెందాయి.
నిమిషాల్లో డెలివరీ
ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.
క్లిక్..ఆర్డర్


