
విశాఖ స్టీల్ప్లాంట్ను రక్షించండి
మహారాణిపేట: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్ రాష్ట్ర ప్రజల జీవనాడి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ఈ అంశాన్ని ఇప్పటికే మూడుసార్లు రాజ్యసభలో ప్రస్తావించానని, కేంద్ర ఉక్కు మంత్రి కూడా తనకు లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రం ప్రస్తుతం సీఎం చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉన్నందున, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఎంపీ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యులు దొండా రాంబాబు, పైల సన్యాసిరాజు, పెంటకోట స్వామి సత్యనారాయణ తొలుత స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ప్రస్తావించగా.. బాబూరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్పర్సన్ సుభద్ర ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గొల్ల బాబూరావు సభ దృష్టికి తెచ్చారు. ఈ రసాయన పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారి ఆందోళనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. సమావేశంలో పలు ఇతర కీలక అంశాలపై కూడా తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జెడ్పీ చైర్మన్ సుభద్ర డిమాండ్ చేశారు.
రైతుల బకాయిలు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బకాయి లు చెల్లించకుండా రైతులకు మొక్కజొన్న వేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని చైర్పర్సన్ ఆమోదించారు.
అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టు వద్దు
అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టును నిలుపుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు, చెట్టి రోష్మిణి డిమాండ్ చేశారు. అల్లూరి కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించడం విచారించదగిన విషయమన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. సెప్టెంబర్ 5న గిరిజన బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్కు ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలో లైంగిక దాడులు జరుగుతున్నా.. చర్యలు తీసుకునే వారు లేరని ఆరోపించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం ఎంత జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. యూరియా సరఫరా చేయడంలోనూ కూటమి విఫలమైందని ఆమె మండిపడ్డారు.

విశాఖ స్టీల్ప్లాంట్ను రక్షించండి

విశాఖ స్టీల్ప్లాంట్ను రక్షించండి