
మైనారిటీలపై చిన్నచూపు
ఇమామ్, మౌజమ్లకు బకాయిలపడ్డ జీతాలు విడుదల చేయాలి
జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ముస్లిం నేతల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం
మహారాణిపేట: మైనారిటీ ముస్లింలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, వారికి రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ఇమామ్, మౌజమ్లకు 11 నెలలుగా బకాయిలపడ్డ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు, 53వ వార్డు కార్పొరేటర్ భర్కత్ అలీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలు, పార్టీ నేతలతో కలిసి ఈ అంశంపై కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ మైనారిటీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. మైనారిటీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు ఉన్నత పదవుల్లో సముచిత స్థానం కల్పించారని తెలిపారు. ముస్లిం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో మసీదులో పనిచేస్తున్న ఇమామ్లకు నెలకు రూ. 10,000, మౌజమ్లకు నెలకు రూ. 5,000 ప్రతి నెల ఇచ్చి వారికి ఆర్థిక భరోసా కల్పించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి, వారికి కల్పించాల్సిన కనీస సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మైనారిటీలకు అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, అలాగే 11 నెలలుగా బకాయిపడ్డ ఇమామ్లు, మౌజమ్ల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజక వర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు పేర్ల విజయ చందర్, పార్టీ నాయకులు అల్లంపల్లి రాజుబాబు, డాక్టర్ జహీర్ అహ్మద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ , దేవరకొండ మార్కెండేయులు, బోని శివరామకృష్ణ , కార్పొరేటర్లు మహ్మద్ ఇమ్రాన్, కో ఆప్షన్ సభ్యులు ఎం.డి షరీఫ్, మైనారిటీ నాయకులు కేవీ బాబా, షేక్ బాబ్జి, మక్బుల్, బిలాల్, మునీర్, సౌకత్ అలీ, మహ్మద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.