
సమష్టి కృషితోనే విజయం సాధించాం
యోగాంధ్ర అభినందన సభలో
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషి, ప్రజాప్రతినిధుల సహకారంతో యోగాంధ్ర విజయవంతమైందని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. వీఎంఆర్డీఏ చిల్ట్రన్ ఎరీనాలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు ప్రశంసనీయ పాత్ర పోషించాయన్నారు. జేసీ కె.మయూర్ అశోక్ రాముడికి లక్ష్మణుడిలా అండగా నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తూ.. విలువైన సూచనలిచ్చారన్నారు. అనంతరం కలెక్టర్ను జిల్లా అధికారులు సత్కరించారు. డీసీపీ అజిత, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, డీసీపీ(అడ్మిన్) కృష్ణకాంత్ పటేల్, డీఆర్వో భవానీ శంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.