
20 ఏళ్ల నరకానికి తెర
అరుదైన శస్త్రచికిత్సతో యువకుడికి పునర్జన్మ!
మహారాణిపేట: వెన్నెముక లోపంతో ఇరవై ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడికి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం, మూత్రం లీకేజీ కారణంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అతనికి శస్త్రచికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ కుచ్చర్లపాటి అభిరామ్ వెల్లడించారు. పాడిరైతు కుటుంబానికి చెందిన 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి పుట్టుకతోనే ‘స్పైనల్ మైలోమెనింగోసీల్’అనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్నా డు. దీని వల్ల నరాలు దెబ్బతిని, మూత్రాశయం పూర్తిగా కుచించుకుపోయింది. ఫలితంగా అతడు సొంతంగా మూత్ర విసర్జన చేయలేని దుస్థితి ఏర్పడింది. నిరంతరం మూత్రం లీకవుతుండటంతో నలుగురిలోకి వెళ్లలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవించేవాడు. ఈ సమస్య అతని కిడ్నీలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపేందుకు కిమ్స్ ఐకాన్ యూరాలజిస్టులు డాక్టర్ పి.మురళీకృష్ణ, డాక్టర్ కె.అభిరామ్, డాక్టర్ కె. సందీప్ రెడ్డిల బృందం ముందుకొచ్చింది. రెండు దశల పునర్నిర్మాణ శస్త్రచికిత్సకు ప్రణాళిక రచించారు. మొదటి దశలో రోగి పేగులోని కొంత భాగాన్ని తీసుకుని, కుచించుకుపోయిన మూత్రాశయాన్ని విస్తరించారు. రెండో దశలో కాలువ ద్వా రా రోగి ఒక సన్నని క్యాథెటర్ ట్యూబు సహాయంతో తనకు తానుగా, పూర్తి నియంత్రణతో మూత్ర విసర్జన చేయగలుగుతున్నాడు. శస్త్రచికిత్స అనంతరం యువకుడి జీవితం పూర్తిగా మారిపోయింది. మూత్రం లీకేజీ సమస్య పూర్తిగా ఆగిపోయింది. దెబ్బతిన్న కిడ్నీల పనితీరు మెరుగుపడి, సాధారణ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు అతను రోజుకు మూడు, నాలుగు సార్లు సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మూత్ర విసర్జన చేసుకోగలుగుతున్నాడు. సామాజికంగా తలదాచుకోవాల్సిన అవసరం లేకుండా, తోటి వారితో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నాడని డాక్టర్ అభిరామ్ తెలిపారు.