
క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదు
పరవాడ: లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 మంది క్షతగాత్రులు నగరంలోని కేజీహెచ్, కిమ్స్ తదితర ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. ప్రస్తుతం గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చెంనాయుడు, రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహలకు మంగళవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరుపై అన్ని కోణాల్లో విచారణ జరిపి.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంట్లోకి చొరబడి యువతి,
ఆమె తల్లిని కొట్టిన వైనం
తగరపువలస: వివాహ బంధంలోకి అడుగు పెట్టకముందే కట్నం వేధింపులకు పాల్పడి.. ఏకంగా ఇంట్లోకి చొరబడి తల్లీకూతుళ్లపై దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయనగరానికి చెందిన ముల్లు సాయి కిశోర్ మంగళవారం రాత్రి జీవీఎంసీ భీమిలి జోన్ రెండో వార్డు జీరుపేటలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నెల రోజుల కిందట సాయి కిశోర్కు ఆ గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి రూ.6 లక్షల కట్నం డబ్బులు ఇవ్వాలని సాయికిశోర్తో పాటు అతని కుటుంబ సభ్యులు యువతిని వేధించడం మొదలుపెట్టారు. తరచూ ఖర్చులకు డబ్బులు కావాలని డిమాండ్ చేశా రు. ఆమె క్రెడిట్ కార్డును కూడా కిశోర్ వాడేశాడు. ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో అమ్మాయి తరపు కుటుంబం నిందితుడి నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే మంగళవారం రాత్రి సాయి కిశోర్.. విజయనగరానికి చెందిన తన స్నేహితులైన కోరాడ హరనాథ్, చెల్లూరు పవన్కుమార్, తాళాడ శ్రవణ్లను కారులో వెంటబెట్టుకుని జీరుపేటలోని ఆమె ఇంటికి వచ్చాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి తల్లి, కూతుళ్లను జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా సాయి కిశోర్.. యువతి తల్లి మెడలో ఉన్న బంగారు హారాన్ని లాక్కొని కారుతో పరారయ్యాడు. గ్రామ స్తులు మిగిలిన ముగ్గురిని పట్టుకుని భీమిలి పోలీసులకు అప్పగించారు. బుధవారం ఉదయం స్టేషన్కు రావాలని ఇరువర్గాలను పోలీసులు ఆదేశించారు.
పెళ్లికి ముందే దారుణం

క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదు