అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం

Jun 25 2025 7:10 AM | Updated on Jun 25 2025 7:14 AM

డాబాగార్డెన్స్‌: నగరంలో ఈ నెల 27న అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర జరగనుంది. టౌన్‌కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయంతో పాటు సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌, హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

టౌన్‌ కొత్తరోడ్డులో..

టౌన్‌కొత్తరోడ్డులో వెలసిన జగన్నాథస్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి జూలై 8 వరకు రథయాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆలయ అర్చకులు పాణంగిపల్లి జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు, కేశవాచార్యులు, యేడిద సురేష్‌బాబుతో కలిసి మంగళవారం రథయాత్ర పోస్టర్‌ ఆవిష్కరించారు. కాగా.. మంగళవారం సాయంత్రం ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ఉత్సవాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం జలాధివాసములు, క్షీరాధివాసములు, రాత్రి విశేష హోమాలు, పంచశయ్యాది వాసములు, 26న ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవం, సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం, సుభద్రాదేవి శాంతి కల్యాణం జరపనున్నారు. 27న ఉదయం 9.10 గంటలకు స్వామిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు జగన్నాథస్వామి తొలి రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. 28 నుంచి జూలై 6 వరకు టర్నర్‌ చౌల్ట్రీ కల్యాణ మండపంలో స్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 7న ఉదయం 9.45 గంటలకు స్వామి తిరుగు రథయాత్ర నిర్వహిస్తారు. 8న ఉదయం సంప్రోక్షణ, పీఠారోహణం అనంతరం స్వామిని యథాస్థానంలో ప్రతిష్టిస్తారు.

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో..

నగరంలో ఈ నెల 27న ఇస్కాన్‌ ఆధ్వర్యంలో 18వ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరగనుంది. పూరీ జగన్నాథస్వామి రథయాత్ర పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఇస్కాన్‌ విశాఖ శాఖ అధ్యక్షుడు సాంబదాస్‌, నితాయి సేవినీ మాతాజీ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఏటా మాదిరి గానే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల కోసం మూడు వేర్వేరు రథాలను సిద్ధం చేశారు. శ్రీల ప్రభుపాదుల విగ్రహాన్ని ఒక చిన్న రథంపై ఉంచి ఊరేగిస్తారు. ఒడిశాలోని పిప్పిలి నుంచి ప్రత్యేక అలంకరణ సామగ్రిని తెప్పించారు. 37 అడుగుల ఎత్తైన రథ గోపురాలు ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా ఎత్తును తగ్గించుకునే, పెంచుకునే వెసులుబాటు కలిగి ఉండటం విశేషం. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతజైలు రోడ్డులోని విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న పార్కింగ్‌ ఏరియా నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎల్‌ఐసీ అంబేడ్కర్‌ కూడలి, డాబాగార్డెన్స్‌, ప్రెస్‌క్లబ్‌ జంక్షన్‌, ప్రకాశరావుపేట జంక్షన్‌ మీదుగా జగదాంబ జంక్షన్‌కు చేరుకుని, అక్కడి నుంచి వాల్తేర్‌ అప్‌రోడ్డు మీదుగా సిరిపురం జంక్షన్‌, గురజాడ కళాక్షేత్రం వరకు రథయాత్ర సాగుతుంది. రథయాత్ర పొడవునా రాష్ట్రం నలుమూలల నుంచి, బెంగాల్‌, ఒడిశా నుంచి వచ్చిన భక్తుల నృత్య కీర్తనలు, కోలాటాలు ప్రదర్శించి రథయాత్రకు శోభను చేకూర్చనున్నారు. గురజాడ కళాక్షేత్రం చేరుకున్న తర్వాత స్వామి వారి లీలా విశేషాలను వివరించి, భక్తులు ప్రేమతో సిద్ధం చేసిన 1008 రకాల ప్రత్యేక వంటకాలను స్వామికి సమర్పిస్తారని సాంబదాస్‌ వివరించారు.

హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో..

హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27న జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రతినిధి యదురాజ దాస ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 27 సాయంత్రం 5 గంటలకు సంప్రదాయ పద్ధతిలో ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం కళాశాల నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎంవీపీ డబుల్‌ రోడ్డు, ఇసుకతోట జాతీయ రహదారి, వెంకోజీపాలెం, క్యాన్సర్‌ హాస్పిటల్‌, బీచ్‌ రోడ్డు, అప్పుఘర్‌ మీదుగా తిరిగి ఐఐఏఎం కళాశాల వరకు యాత్ర సాగుతుంది. ఈ ఉత్సవం జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల దివ్య ప్రయాణాన్ని గుర్తు చేస్తుందని, భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ కార్యక్రమం సార్వత్రిక సౌభ్రాతృత్వం, ప్రేమ, భక్తిని సూచిస్తుందని యదురాజ దాస తెలిపారు. రథయాత్రలో ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. డాక్టర్‌ నిష్క్రించిన భక్త దాస అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.

27న జగన్నాథ స్వామి రథయాత్ర

దేవదాయ శాఖ, ఇస్కాన్‌, హరేకృష్ణ

మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం1
1/1

అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement