
సింహాద్రిపురం దొంగతనం కేసు ఛేదన
రూ. 9.25 లక్షల బంగారం రికవరీ
ఎంవీపీకాలనీ: సింహాద్రిపురంలో జరిగిన దొంగతనం కేసును ఎంవీపీకాలనీ క్రైం పోలీసులు ఛేదించారు. రూ.9.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. మంగళవారం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ద్వారకా జోన్ క్రైం ఏసీపీ లక్ష్మణరావు ఈ వివరాలను వెల్లడించారు. రామభక్త రామలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రిపురం స్టీల్ప్లాంట్ క్వార్టర్స్లో నివాసముంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఓ ఫంక్షన్కు వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలో ఇంట్లోని బీరువా తెరచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగిందని గుర్తించి, ఆమె ఎంవీపీ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావు, ఎంవీపీ క్రైం ఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐ కిశోర్బాబు తదితరులతో కూడిన బృందం రెండు నెలలపాటు దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి, రామలక్ష్మి ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న కనకాల భవానీ మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. రామలక్ష్మి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలించగా, ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించింది. వారిని స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా.. భవానీ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. మహిళా పోలీసులు తమదైన శైలిలో భవానీని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి రూ. 9.25 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను (45 తులాల బంగారు హారం, ఉంగరం, పాపిడిబిళ్ల) పోలీసులు రికవరీ చేశారు. కేసును ఛేదించిన బృందాన్ని క్రైం ఏసీపీ లక్ష్మణరావు అభినందించారు. సమావేశంలో సీఐ చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు.