
ఉలికిపాటు
● ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనతో కలకలం ● గత ప్రమాదాల నుంచి నేర్చుకోని యాజమాన్యం ● ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న ఆరోపణలు
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఫార్మా ఉద్యోగులు, కార్మికులు ఉలికి పడుతున్నారు. తరచూ ఫార్మా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో పరిశ్రమలో సేఫ్టీ మేనేజర్గా పనిచేస్తున్న హదారాబాద్కు చెందిన పరిమి చంద్రశేఖర్(32), షిప్ట్ సేఫ్టీ అఫీసర్గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్(25) మృత్యువాత పడ్డారు. హెల్పర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బైడు బైసాల్(37) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వరుస ప్రమాదాలతో భయాందోళన
● గతంలో సినర్జీన్ యాక్టివ్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు, విజయనగరానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
● రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో గత డిసెంబర్లో ప్రొడక్షన్ బ్లాక్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై న ఘటనలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు దేవిబాగ్, ఉగ్రేసర్గౌడ్లు అస్వస్దతకు గురయ్యారు.
● గత ఏప్రిల్లో అపిటోరియా పరిశ్రమ యూనిట్–6లో నైట్రోజన్ గ్యాస్ పీల్చడంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆళ్ల గోవింద్ మృతి చెందాడు.
● ఆల్కలీ మెటల్ ఫార్మా పరిశ్రమలో ఏప్రిల్లో జరిగిన మరో ఘటనలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన సీహెచ్.రమణ(32) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
● అదే నెలలో ఠాగూర్ లేబొరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రం చేస్తున్న క్రమంలో రియాక్టర్ వాల్వ్ నుంచి విడుదలైన విషవాయువును పీల్చడం వల్ల కె.సింహచలం అనే కాంట్రాక్టు కార్మికుడు అస్వస్దతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
● మెట్రెకమ్ పరిశ్రమలో ఖాళీ రసాయన డబ్బాలు, వ్యర్ధాల వల్ల ప్రమాదం నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉలికిపాటు