
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్
మహారాణిపేట: పరవాడలోని జేఎన్ ఫార్మాసిటీలో ఉన్న ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన పరిమి చంద్రశేఖర్(తెలంగాణా), శరగడం కుమార్(మునగపాక) కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎసెన్షియా ఫార్మా తదితర కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మరణించారని పేర్కొన్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏడాది కాలంలో ఇన్ని ప్రమాదాలు ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఎలా నష్ట పరిహారం ఇచ్చారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు.