ఆరోపణలున్న సిబ్బందిపై బదిలీ వేటు?
ఐదేళ్లు పూర్తయిన మరికొందరికి స్థానచలనం
సాక్షి కథనాలకు స్పందన
విశాఖ సిటీ: అవినీతి నిరోధక శాఖలో ప్రక్షాళన షురూ అయింది. అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బందిపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. దీర్ఘకాలంగా ఏసీబీలో తిష్టవేసుకుని కూర్చున్న వారికి స్థానచలనం కలిగింది. ఏసీబీలో అవినీతి సిబ్బందిపై ‘సాక్షి’ వరుస కథనాలతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీరితో పాటు ఐదేళ్లు నిబంధన ప్రకారం పలువురికి బదిలీ చేస్తూ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఏసీబీలో పలువురి వ్యవహార శైలిపై మొదట్నుంచి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఉన్నతాధికారుల పేరు చెప్పి పలు ప్రభుత్వ శాఖల్లో భారీగా వసూళ్లకు తెరలేపారన్న వార్తలు వినిపించాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా శాఖల నుంచి నెలసరి మామూళ్లకు అలవాటు పడ్డారన్న గుసగుసలు ఉన్నాయి. ఏసీబీలోనే దండిగా ఆదాయం వస్తుండడం కొంత మంది సిబ్బంది రాజకీయ నేతల ఆశీస్సులతో ఇక్కడి నుంచి వెళ్లకుండా తిష్టవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఎస్ఐ, ఒక హెచ్సీ ఏసీబీలో చక్రం తిప్పినట్లు ఆఫీస్లోనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల పేరుతో వీరు చేస్తున్న దందాపై ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
దీనిపై అంతర్గత విచారణ చేపట్టి అవినీతి ఆరోపణలు ఉన్న వారితో పటు ఐదేళ్ల నిబంధన ప్రకారం బదిలీలు చేపట్టారు. వీరిలో ఎస్ఐలు బి.సురేష్, కె.శ్రీనివాసరావులను విశాఖ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే హెచ్సీలు టి.కొండలరావు, ఎం.సత్యనారాయణ, ఆర్.చంద్రశేఖర్నాయుడు, కానిస్టేబుల్ ఎస్.రమేష్లను విశాఖ సీపీకి కేటాయించారు. అదే విధంగా హెచ్సీ జి.రాంబాబు, కానిస్టేబుళ్లు కె.రామకిరణ్, టి.శ్రీనివాసరావులను అనకాపల్లి ఎస్పీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.