వేటకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

వేటకు వేళాయె

Jun 13 2025 4:39 AM | Updated on Jun 13 2025 4:39 AM

వేటకు వేళాయె

వేటకు వేళాయె

● రేపు అర్ధరాత్రి నుంచిసముద్రంలో చేపలవేట ప్రారంభం ● బోట్లను సిద్ధం చేస్తున్న మత్స్యకారులు

మహారాణిపేట: మత్స్యకారులు వేటకు సిద్ధమవుతున్నారు. హార్బర్‌ మళ్లీ కళకళలాడనుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన వేట నిషేధం గడువు శనివారంతో ముగియనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బోసిపోయిన విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ మళ్లీ సందడిగా మారనుంది. ఏప్రిల్‌ 15న వేట నిషేధం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరామ సమయంలో మత్స్యకారులు తమ పడవలకు, వలలకు మరమ్మతులు పూర్తి చేశారు. ఇంజిన్లు, గేర్‌ బాక్సులు, పంఖాలు వంటి కీలక భాగాలను బాగు చేయించుకుని బోట్లను వేటకు సిద్ధం చేశారు.

గంగమ్మ తల్లికి పూజలు

ప్రతి ఏటా వేట ప్రారంభానికి ముందు గంగమ్మ తల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా వేటలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా, గంగమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ నెల 10న హార్బర్‌లో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నట్లు రాష్ట్ర మరపడవల సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌ తెలిపారు. కాగా.. ఈ నెల 15 నుంచి మత్స్యకారులు తిరిగి వేట ప్రారంభించవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. అయితే వేటకు వెళ్లేటప్పుడు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, తగిన జాగ్రత్తలతో వేట సాగించాలని కోరారు.

వేటపైనే జీవనాధారం

జిల్లాలో 65 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న 32 మత్స్యకార గ్రామాల్లో సుమారు 1.15 లక్షల కుటుంబాలు మత్స్యకార వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,547 మర, మోటారు, సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ 61 రోజుల విరామం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు వేట తిరిగి ప్రారంభం కానుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement