
తల్లికి వందనం..వంచన
విశాఖ సిటీ: ‘తల్లికి వందనం’ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తల్లుల కు పంగనామాలు పెడుతోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడికి వెళ్లే ప్రతి విద్యా ర్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, తాజాగా నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచే డబ్బులు జమ అవుతాయని పత్రికా ప్రకటనలు రావడంతో బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన తల్లులు, డబ్బులు జమ కాకపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు.
హామీల ఉల్లంఘన, నిబంధనల వల
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే, ‘ఫస్ట్ క్లాస్లో చేరిన వారికి వచ్చే ఏడాది నుంచి మాత్రమే ఇస్తాం’ అంటూ ప్రభుత్వం మాట మార్చిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల కంటే ఎక్కువ జీతం వచ్చిన వారిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. ఎటువంటి ఆస్తులు లేకపోయినా, ఉన్నట్లుగా చూపిస్తూ మరికొంతమందిని పథకం నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అనుమానాస్పద జాబితా ఎంపిక
ఏ పథకానికై నా దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి లబ్ధిదారులను గుర్తించడం తప్పనిసరి. కానీ ఈ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించకుండానే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. గత విద్యా సంవత్సరం డేటా ఆధారంగా జాబితాను సిద్ధం చేయడం వల్ల, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు పథకం వర్తించదని తల్లిదండ్రులకు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
ఆస్తుల లింకుతో ఇక్కట్లు
గతంలో ‘అమ్మ ఒడి’ తీసుకున్న లబ్ధిదారులు సైతం ఈ జాబితాలో అనర్హులుగా తేలడం గమనార్హం. దీనిపై సచివాలయంలో ఆరా తీయగా, వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నట్లు లేదా రూ.12 వేలు కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపుతూ అనర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వాస్తవానికి, అనర్హుల్లో అత్యధిక శాతం మందికి ఆస్తులు లేనప్పటికీ, ఉన్నట్లు చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆస్తులు లేవని, అద్దె ఇంట్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ, సచివాలయం సిబ్బంది తమకు సంబంధం లేదని జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లాలంటూ తిప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే, మ్యాపింగ్ చేపట్టినప్పుడు, అద్దెకున్న వారి ఆధార్ కార్డును ఇంటి ఆస్తి పన్నుతో లింక్ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ పరిశీలిస్తే, ఆస్తి ఉన్నట్లు చూపిస్తోంది. ఈ లింకును తొలగించడానికి సచివాలయం సిబ్బంది నిరాకరించడం, ఉన్నతాధికారులు సైతం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనల పేరుతో తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్య కుదింపు
2022–23లో ఇంటికొకరు చొప్పున 1,70,467 విద్యార్థులకు పంపిణీ
ఇపుడు ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని కూటమి హామీ
కానీ జిల్లాలో 1,90,433 మందే అర్హులుగా తేల్చిన ప్రభుత్వం
జిల్లాలో ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు 4 లక్షల మంది విద్యార్థులు
దరఖాస్తులు స్వీకరించకుండానే లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు
రూ.12 వేలు కంటే ఎక్కువ జీతం వస్తే తల్లికి వందనం కట్
ఎటువంటి ఆస్తులు లేకున్నా ఉన్నట్లు చూపిస్తూ అనర్హులుగా ప్రకటన
లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత
ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ కింద రూ.15 వేలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేశారు. దీని ప్రకారం జిల్లాలో 3 నుంచి 3.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అందరూ భావించారు. కానీ జిల్లాలో మొత్తం 4 లక్షల మంది విద్యార్థులు ఉండగా, కేవలం 1,30,706 మంది తల్లులకు గాను 1,90,433 మంది పిల్లలకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. 2022–23లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని 1,70,467 మందికి అమలు చేసింది. ఎన్నికల కారణంగా 2024లో నిధులు పడలేదు. రెండేళ్ల తర్వాత అమలు చేస్తున్న పథకంలో లబ్ధిదారుల సంఖ్య 3 లక్షలకు పెరుగుతుందనుకుంటే, కేవలం 19,966 మందికి మాత్రమే అదనంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.