ఆన్‌! | - | Sakshi
Sakshi News home page

ఆన్‌!

Jun 14 2025 6:35 AM | Updated on Jun 14 2025 6:35 AM

ఆన్‌!

ఆన్‌!

ఆఫ్‌..
ఇంజిన్‌
మీటర్‌
● బండి షెడ్డులో ఉన్నా బిల్లు తీసేసుకుంటున్నారు ● మెకానికల్‌ విభాగంలో ఆయిల్‌ మాయ ● ప్రతీ నెలా రూ.లక్షన్నర మేర పక్కదారి ● అర్హత లేకపోయినా ఏఈ స్థాయిలో జీపు వినియోగం ● ఏడాది కాలంగా అడ్డగోలు వ్యవహారం

సూత్రధారులు ఓ ఏఈ...

మలేరియా అధికారి....!

జీవీఎంసీలో జరుగుతున్న భారీ ఆయిల్‌ కుంభకోణంలో మరిన్ని షాకింగ్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆయిల్‌ మాయాజాలంలో ప్రధానంగా ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) తో పాటు ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి, మలేరియా విభాగంలోని ఒక అధికారికి కీలక పాత్ర ఉందని విమర్శలున్నాయి. తిరగని వాహనాలకు సైతం ఆయిల్‌ బిల్లులు దోచేస్తున్న జీవీఎంసీ మెకానికల్‌ విభాగం అధికారులు, కార్డుల ద్వారా మాత్రమే ఆయిల్‌ జారీ చేయాలనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. అయితే హైడ్రాలిక్‌ ఆయిల్‌ కోసం మాత్రం 20 లీటర్ల కూపన్లను అదనంగా ఇస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం కాగితాలపై మాత్రమే జరుగుతున్న వ్యవహారం అని, నిజానికి ఆయిల్‌ దారి మళ్లుతోందని ఆరోపణలున్నాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మెకానికల్‌ విభాగంలో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం రోడ్లపై తిరగని వాహనం పేరుతో కూడా ప్రతీ నెలా ఆయిల్‌ బిల్లు డ్రా అవుతోంది. ఏఈ స్థాయి అధికారి ఏకంగా రెండు జీపుల్లో తిరుగుతున్నట్టు లెక్కలు చూపి ప్రతీ నెలా రూ. లక్ష మేర ఆయిల్‌ బిల్లును నొక్కేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన గత ఏడాది కాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఇక జీవీఎంసీ నుంచి ఎస్‌ఈ స్థాయి అధికారి బదిలీపై వెళ్లి.. తిరిగి ఇక్కడకు వచ్చే వరకూ ఆయనే వాహనాన్ని నడుపుతున్నట్టు మరీ దోపిడికి తెగబడుతున్నారు. ఇక ఫాగింగ్‌ మిషన్ల ఆయిల్‌ బిల్లు ఏకంగా ప్రతీ నెలా రూ. 30 లక్షల మేర అదనంగా పెంచేశారు. మొత్తంగా జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో మాత్రం వాహనంలో ముల్లు కదలకపోయినా ఆయిల్‌ బిల్లు మాత్రం లక్షలకు చేరుతోంది.

ఏడాది కాలంగా...!

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తిరుగుతున్న వాహనాలకు మాత్రమే కాకుండా, షెడ్డులో మూలకు చేరిన వాహనాలు నడు స్తున్నట్లు లెక్కలు చూపిస్తూ ఆయిల్‌ బిల్లులు కాజేస్తున్నారు. ఉదాహరణకు, పెద్దగా వాడకంలో లేని రెండు జీపులతో పాటు, అసలు పనిచేయకుండా నిలిచిపోయిన ఒక టాటా సఫారీ వాహనం పేరుతో ప్రతినెలా రూ. 1.5 లక్షల ఆయిల్‌ బిల్లులు డ్రా అవుతున్నాయి. ఈ విధంగా గత ఏడాది కాలంగా ఆయిల్‌ దోపిడీ జరుగుతోందని సమాచారం. అంటే, వాహనం ఆన్‌లో లేకపోయినా, జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలోని కొందరు అధికారులు డీజిల్‌ బిల్లు మీటర్‌ను మాత్రం ఆన్‌లోనే ఉంచుతున్నారన్నమాట.

నిబంధనలకు విరుద్ధంగా..

నిబంధనల ప్రకారం జీవీఎంసీలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) స్థాయి అధికారికి ఎటువంటి వాహనం కేటాయించరు. కేవలం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈ) స్థాయి అధికారి నుంచే వాహనాలను కేటాయిస్తారు. అయినప్పటికీ ఏడాది కాలంగా మెకానికల్‌ విభాగంలోని ఒక ఏఈ ఏకంగా రెండు వాహనాలను ఉపయోగిస్తూ, ప్రతినెలా ఆయిల్‌ బిల్లుల రూపంలో లక్ష రూపాయల వరకూ కాజేస్తున్నారని విమర్శలున్నాయి.

హైడ్రాలిక్‌ ఆయిల్‌, ఫాగింగ్‌ మిషన్ల

పేరుతోనూ అక్రమాలు

హైడ్రాలిక్‌ ఆయిల్‌ కూపన్ల విధానాన్ని రద్దు చేసినప్పటికీ, ఒక్కో వాహనానికి 20 లీటర్ల చొప్పున కూపన్లను రోజువారీగా అదనంగా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీటరు ధర రూ. 350 పైచిలుకు పలుకుతుంది. ఇక, ఫాగింగ్‌ మిషన్లు, స్ప్రింక్లర్లకు ఆయిల్‌ బిల్లులను అమాంతంగా రెట్టింపు చేయడంతో నెలకు రూ. 30 లక్షల మేర ప్రజాధనం పక్కదారి పడుతోంది. మొత్తంగా చూస్తే, జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో అవకాశం దొరికిన ప్రతిచోటా ఆయిల్‌ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలున్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫాగింగ్‌ మిషన్ల పేరుతో

నెలకు రూ. 30 లక్షల అదనపు దోపిడీ

ఇక ఫాగింగ్‌ మిషన్ల పేరుతో నెలకు అదనంగా రూ. 30 లక్షల మేర ప్రజాధనం కాజేస్తున్నట్లు విమర్శలున్నాయి. జీవీఎంసీలో 8 పెద్ద ఫాగింగ్‌ మిషన్లు, 80 మీడియం సైజు ఫాగింగ్‌ మిషన్లు, 25 స్ప్రింక్లర్లు ఉన్నాయి. వీటికి గతంలో ప్రతినెలా రూ.38 లక్షల మేర ఆయిల్‌ బిల్లులు చెల్లించేవారు. అయితే, డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు అధికారులు మెకానికల్‌ విభాగంతో కుదుర్చుకున్న ‘మామూళ్ల ఒప్పందంలో’ భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ. 68 లక్షలకు పెంచేశారు. ఈ అక్రమ ఒప్పందానికి ప్రతిఫలంగా, ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారికి, మలేరియా విభాగానికి చెందిన మరో అధికారికి చెరో రూ. 2 లక్షల చొప్పున ప్రతి నెలా ముట్టచెప్పే విధంగా ఒప్పందం కుదిరిందని ఆరోపణలున్నాయి. ప్రతినెలా ఈ ‘మామూళ్ల పంపకంలో’ మలేరియా విభాగంలోని ఒక అధికారిదే కీలక పాత్ర అని తెలుస్తోంది.

పూర్తిస్థాయి విచారణ

ఈ ఆరోపణలపై మెకానికల్‌ విభాగం ఈఈ రత్నాకర్‌ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా గత 10 రోజులుగా జీపులకు ఆయిల్‌ బిల్లులను నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ ఆయిల్‌ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం జీవీఎంసీ పరిపాలనలో పారదర్శకత లేకపోవడాన్ని, అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో స్పష్టం చేస్తోంది.

బదిలీ అయిన తరువాత కూడా..

ఇంకో విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఒక ఎస్‌ఈ స్థాయి అధికారి జీవీఎంసీలో పనిచేసి కాకినాడకు బదిలీపై వెళ్లిన తర్వాత ఆరు నెలల పాటు తిరిగి జీవీఎంసీకి వచ్చే వరకు ఆయన పేరు మీద ఉన్న వాహనాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. అంటే, ఆరు నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తించని అధికారి పేరుతో వాహనాన్ని నడుపుతున్నారన్నమాట. మరో టాటా సఫారీ వాహనాన్ని కూడా ఇంకో అధికారి వినియోగిస్తున్నారని, గత రెండు నెలలుగా ఆయిల్‌ బిల్లులను భారీగా డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement