
‘మురికివాడల’ కేసు కొట్టివేత
డాబాగార్డెన్స్: దశాబ్దానికి పైగా సాగిన న్యాయపోరాటం ఫలించింది. 2012లో జీవీఎంసీ, పోలీస్ అధికారులు విశాఖలోని మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను శుక్రవారం సెషన్స్ కోర్టు కొట్టివేసింది. అప్పట్లో 1200 మందిపై కేసులు నమోదు చేసి 94 మందిని అరెస్టు చేసి జైలుకి పంపారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 8 మంది నిందితులు మరణించగా, పలువురు అనారోగ్యానికి గురయ్యారు. విశాఖ రైల్వే న్యూకాలనీలోని ఇందిరాగాంధీ కాలనీ, జ్ఞానాపురం బాబూ కాలనీ, దయానందనగర్ చాకలిగెడ్డ, రాజీవ్ కాలనీ, సెబాస్టియన్ కాలనీ, కంచరపాలెం మెట్టు పైడిమాంబ కాలనీ, మాధవధార ఏకలవ్య కాలనీ, సెంట్రల్ జైలు రామకృష్ణాపురం కాలనీ, పెందుర్తి చినముషిడివాడ అంబేడ్కర్ నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఫేకర్ లేఅవుట్, వినాయకనగర్ కాలనీ ప్రజలపై అక్రమంగా కేసులు బనాయించారు.2వ జిల్లా, సెషన్స్ కోర్టు , 1వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈ కేసులను కొట్టివేశాయి. ఈ కేసులో బాధిత ప్రజల తరఫున న్యాయవాదులు పల్లేటి అప్పారావు, కేఎస్ చలం, ఢిల్లీరావు, కె.పద్మ, ఎన్బీఎస్ చలపతి, ఎంఎన్ రాజు, యు.కనకరాజు వాదించారు. కోర్టు తీర్పు మురికివాడ ప్రజల పోరాటం న్యాయమైనదని నిరూపించిందని బాధితులు పేర్కొన్నారు. ఇప్పటికై నా జీవీఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు మురికివాడ ప్రజల హక్కులను గుర్తించి, ఇందిరాగాంధీ కాలనీకి సంపూర్ణ హక్కులు కల్పించి గౌరవప్రదమైన జీవనం సాగించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.