
విమాన ప్రమాద మృతులకు వైఎస్సార్ సీపీ ఘన నివాళి
డాబాగార్డెన్స్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి శుక్రవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి మృతులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని, ఇంతవరకు ప్రమాదానికి గల కారణాలు తెలియకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించిన రూ.కోటి పరిహారం సరిపోదని, దీనిని మరింత పెంచి బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, గుజరాత్ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దాదాపు 241 మంది అకాల మరణం చెందారని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంతో పాటు, ఆ విమానం మెడికల్ కాలేజీపై కూలి మెడికో విద్యార్థులు కూడా మృత్యువాత పడటం అత్యంత విచారకరమన్నారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారని, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లపల్లి సుభద్ర, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్, దేవన్రెడ్డి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నియోజకవర్గ విభాగాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.