
అనుమతుల్లేకుండా గోడ కూల్చివేత
ఏఎంటీజెడ్పై స్టీల్ప్లాంట్ ఆగ్రహం
పెదగంట్యాడ: జీవీఎంసీ 77వ వార్డు పరిధి మదీనాబాగ్ సమీపంలోని ప్రగతి మైదానం వద్ద ఏఎంటీజెడ్ అధికారులు అనుమతులు లేకుండా స్టీల్ప్లాంట్ గోడను కూల్చివేశారు. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఇటీవల ఏఎంటీజెడ్ ప్రాంగణంలో పిలానీ పబ్లిక్ స్కూల్ నిర్మించారు. అయితే విద్యార్థులు, బస్సులు నేరుగా వెళ్లేందుకు వీలుగా సుమారు 30 మీటర్ల మేర గోడను గత నెలలో కూల్చివేసి, అక్కడ గేటును ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్టీల్ప్లాంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏఎంటీజెడ్ అధికారులను ప్రశ్నించారు. అయితే ఏఎంటీజెడ్ అధికారులు స్టీల్ప్లాంట్ అధికారుల మాటలను లెక్కచేయకుండా, వారిని అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా తమ పనిని కొనసాగించారు. గురువారం స్టీల్ప్లాంట్ అధికారులు మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఏఎంటీజెడ్ అధికారులు వారితో వాగ్వాదానికి దిగారు. స్టీల్ప్లాంట్ అధికారులపై దుర్భాషలాడారు. ‘మా వెనకాల ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేయలేరు.’ అని బెదిరించారని స్టీల్ప్లాంట్ అధికారులు వాపోయారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, ఎస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేస్తామని స్టీల్ప్లాంట్ అధికారులు తెలిపారు. 2013లో స్టీల్ప్లాంట్ నిర్మించిన ఈ గోడను అడ్డగోలుగా కూల్చి గేటు ఏర్పాటు చేయడం సరికాదని, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు.