● కూటమి ప్రభుత్వం వచ్చాకమహిళలపై పెచ్చుమీరిన దాడులు ● ఇంత జరుగుతున్న బాబు, పవన్ స్పందించరా? ● హోం మంత్రి ఉన్నట్టా? లేనట్టా?? ● కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ● బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత
డాబాగార్డెన్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళలు, బాలికలపై దాడులు, లైంగిక దాడులు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సూచనలతో ఈ నిరసనను చేపట్టారు. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ‘నారా పాలనలో మహిళల ఆక్రందనలు.. ఆడబిడ్డలపై అఘాయత్యాలు.. బాబు పాలనలో రక్షణ లేదు.. భక్షణే’, ‘నేరగాళ్ల చేతిలో ఆడబిడ్డల భవిత’, ‘కక్షల్లో ప్రభుత్వం–పోలీసులు’, ‘మంటల్లో శాంతి భద్రతలు’, ‘రోజుకో అఘాయత్యం, గంటకో నేరం’, ‘ఆడబిడ్డలకు లేదు రక్షణ’, ‘బాబు వచ్చాడు, దిశ తీసేశాడు’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, హోంమంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుందని విమర్శించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ఇప్పుడు జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణకు పెద్ద పీట వేశారని, దిశ చట్టాన్ని అమలు చేసి భద్రత కల్పించారని గుర్తు చేశారు. మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ గత ఏడాదిగా మహిళలు, బాలికలపై దాడులు, లైంగికదాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉండేదని గుర్తు చేస్తూ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక లైంగికదాడులు జరుగుతున్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏమయ్యాయని చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, నాగ శశికళ, చుక్క వరలక్ష్మి, రీసు అనురాధ, బి.విజయలక్ష్మీ, రామలక్ష్మి, పప్పల సునీత, శ్రీదేవివర్మ, బి.పద్మావతి, బయ్యవరపు రాధ, సత్యాల సాగరిక, రాజేశ్వరి, మాసిన లక్ష్మి, నాగమణి, ఈశ్వరి, శిరీష, విశాలక్షి, సలాది భాను, మళ్ల ధనలత, పత్తివాడ కనక, మజ్జి జ్యోతి, రమణమ్మ, సత్యవతి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళల నిరసనకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, దొడ్డి బాపూ ఆనంద్, పీతల వాసు, ముత్తాబత్తుల రమేష్, పచ్చిరపల్లి రాము పలువురు నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.
‘నారా’ పాలనలో నేరాలెన్నో..