
పునరుత్పాదక శక్తిపై వర్క్షాప్ రేపు
విశాఖ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ(ఎంఎన్ఆర్ఈ) ఆధ్వర్యంలో ఈ నెల 13న నోవాటెల్ హోటల్లో సౌత్ జోన్ రీజనల్ వర్క్షాప్ను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి హాజరుకానున్నారు. రాష్ట్రం తరఫున విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, నెడ్క్యాప్ వీసీ–ఎండీ కమలాకర్బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృఽథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, పలు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఈ వర్క్షాప్లో ప్రధానంగా పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర ప్రభుత్వ పథకాల అమలు తీరు, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఆవశ్యకతపై చర్చించనున్నారు.
కేకే లైన్లో రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: కె.కె.లైన్లోని సుకు–కోరాపుట్ మధ్య జరుగుతున్న రెండవ లైన్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచ పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 13, 16వ తేదీల్లో విశాఖపట్నం–కోరాపుట్(18512) బై వీక్లీ ఎక్స్ప్రెస్ డుమురిపుట్ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 14, 17వ తేదీల్లో కోరాపుట్–విశాఖపట్నం(18511) బై వీక్లీ ఎక్స్ప్రెస్ డుమురిపుట్ నుంచి బయలుదేరుతుంది. ఈ తేదీల్లో డుమురిపుట్–కోరాపుట్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు.
● ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నం–కోరాపుట్(58538) పాసింజర్ దమన్జోడి వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు కోరాపుట్–విశాఖపట్నం(58537) పాసింజర్ దమన్జోడి నుంచి బయలు దేరుతుంది. ఈ తేదీల్లో ఈ రైలు కోరాపుట్–దమనజోడి మధ్య రాకపోకలు సాగించదని రైల్వే అధికారులు తెలిపారు.
తహసీల్దార్లు విధుల్లో చేరికపై సందిగ్ధం
మహారాణిపేట: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయిన ఇద్దరు తహసీల్దార్లు విధుల్లో చేరికపై సందిగ్ధం నెలకొంది. ఇటీవల బదిలీ అయిన రామకృష్ణ (పెందుర్తి తహసీల్దార్గా), ఎంవీవీ ప్రసాద్ (కలెక్టరేట్లో సి.సెక్షన్ పర్యవేక్షకుడిగా) ఇంకా విధుల్లో చేరలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణను అల్లూరి జిల్లా కలెక్టర్ రిలీవ్ చేయడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రసాద్ తనకు తహసీల్దార్ పోస్ట్ కేటాయిస్తేనే వస్తానని చెబుతున్నట్లు సమాచారం. ఈ కారణాలతో ఇద్దరు అధికారులు ఇంకా రిలీవ్ కాలేదని తెలుస్తోంది.
సమాచార శాఖ డీడీగా సదారావు
మహారాణిపేట: సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా సదారావు నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ చాలా రోజుల నుంచి డీడీ పోస్టు ఖాళీగా ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డి.రమేష్ను విశాఖ జిల్లా ఏడీగా నియమించారు. ఈ పోస్టు కూడా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. విశాఖ జిల్లా డీపీఆర్వో సీహెచ్ రమణను అనకాపల్లి జిల్లా డీపీఆర్వోగా ప్రభుత్వం బదిలీ చేసింది.
పాఠశాలలు, హాస్టళ్లకు సన్న బియ్యం
మహారాణిపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సన్న బియ్యాన్ని సిద్ధం చేశామని, గురువారం నుంచి జిల్లాలోని మొత్తం 582 ప్రభుత్వ పాఠశాలలు, 70 సంక్షేమ హాస్టళ్లలో వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని 25 కిలోల ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మండల స్థాయి గోదాములకు చేరవేశారు. అక్కడి నుంచి నేరుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన ప్యాకెట్లను సరఫరా చేసినట్లు చెప్పారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జేసీ వెల్లడించారు.
ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవోగా నీలిమ
మర్రిపాలెం: ఐసీడీఎస్ విశాఖ అర్బన్ సీడీపీవోగా కె.నీలిమ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్అండ్బీ జంక్షన్ సమీపంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న రమణకుమారి యలమంచిలికి బదిలీ అయిన సంగతి తెలిసిందే..