
జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు
మహారాణిపేట: జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చినట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి, పెండింగ్లో ఉన్న 12 అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఏటా మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి, ఈ నెల 21న జరగనున్న ‘యోగాంధ్ర’పూర్తయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హై పవర్ కమిటీ, జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలన్నారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, చింతాడ మదన్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.ఎస్.జగన్ మోహన్రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.