
ఉపాధ్యాయ కౌన్సెలింగ్ గందరగోళం
● ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయులు ● కనీస ఏర్పాట్ల కరవు ● అధికారులను నిలదీసిన టీచర్లు ● సాంకేతిక లోపం అంటూ నేటికి కౌన్సెలింగ్ వాయిదా
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాల సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) బదిలీలకు సంబంధించి మంగళవారం నిర్వహించాల్సిన మాన్యువల్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. కొన్ని రోజులుగా ధర్నాలు, నిరసనలతో తమ సమస్యలను వినిపించిన ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. విద్యాశాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ కౌన్సెలింగ్కు అర్హులైన 1 నుంచి 500 మంది ఉపాధ్యాయులను పిలవగా, వారంతా మధ్యాహ్నం 2 గంటలకే హాజరయ్యారు. అయితే కౌన్సెలింగ్ ప్రక్రయ గంటల తరబడి ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. అధికారులను నిలదీశారు. కౌన్సెలింగ్ జరుపుతారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొంటూ కౌన్సెలింగ్ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు రాత్రి 9 గంటలకు ప్రకటించారు. అప్పటివరకు నిరీక్షించిన ఉపాధ్యాయులు ఈ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం హాజరైన ఉపాధ్యాయులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల నుంచి చంటి పిల్లలతో సహా హాజరైన కొందరు ఉపాధ్యాయులు రాత్రివేళ తీవ్ర అవస్థలు పడ్డారు. నగరానికి దగ్గరగా ఉన్నవారు ఇళ్లకు చేరుకోగా, దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు వసతి కోసం లాడ్జీలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 9 గంటలకు 1 నుంచి 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే విద్యా శాఖ అధికారులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ అయినా సక్రమంగా జరుపుతారో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు.

ఉపాధ్యాయ కౌన్సెలింగ్ గందరగోళం