
ప్రపంచ రికార్డు లక్ష్యంగా యోగా దినోత్సవం
● రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి ● అధికారులతో రాష్ట్ర మంత్రి లోకేష్ సమీక్ష
మహారాణిపేట: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఒకే ప్రాంతంలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహించడమే లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారన్నారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు పట్టుదల, క్రమశిక్షణతో విజయవంతం చేయాలని కోరారు. ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జూన్ 21న ఆర్.కె. బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవునా 247 కంపార్ట్మెంట్లలో యోగా కార్యక్రమం జరగనుంది. ఉదయం 6:30 గంటలకు ప్రధాని మోడీ ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్ అందజేయాలన్నారు. మొత్తం 108 పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహించనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి కంపార్ట్మెంట్కు ఒక గెజిటెడ్ అధికారిని నియమించామని, క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. రవాణా నియంత్రణకు కమాండ్ కంట్రోల్ రూమ్, 1200 కెమెరాలు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 3,500 ఆర్టీసీ బస్సులు, 8 వేల ప్రైవేటు బస్సులు సిద్ధం చేశామని తెలిపారు. భద్రత కోసం 116 అంబులెన్స్లు, 1400 బయో టాయ్లెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయుస్వామి, రాష్ట్రమంత్రులు అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎల్ఎల్సిలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.