● గ్యాస్ వచ్చినా.. ఖాతాల్లో జమకాని నగదు ● మాట దాటేస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు
కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా మొదలెట్టిన ఉచిత గ్యాస్ పథకం తుస్సుమంటోంది. రెండో విడతకే సబ్సిడీ చెల్లింపులపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టుంది. గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయిన 24 గంటల నుంచి 48 గంటల్లో రాయితీ సొమ్ము లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో చేరతాయని చెప్పిన మాటలు.. గాల్లో కలిసిపోయాయి. రోజులు గడుస్తున్నా.. రాయితీ సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
మహారాణిపేట: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రెండో విడత లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. తొలి విడత గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడతలో గ్యాస్ తీసుకున్న లబ్ధిదారులు రాయితీ డబ్బులు రాలేదని లబోదిబోమంటున్నారు. గ్యాస్ తీసుకుని రోజులు గడుస్తున్నా.. తమ ఖాతాల్లో సబ్సిడీ జమ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారుల్ని అడుగుతుంటే.. ఈ రోజు, రేపు అంటూ మాట దాటేస్తున్నారని వాపోతున్నారు.
మెలికల మీద మెలికలు
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మెలికల మీద మెలికలు పెడుతున్నారు. ఉచిత సిలిండర్లు రావాలంటే రైస్ కార్డు తప్పనిసరి అని మెలిక పెట్టారు. దీంతో మధ్య తరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎన్నికల ముందు ఒకలా.. ఇప్పుడు మరోలా కూటమి ప్రభుత్వం మాట మార్చిందని ఆక్షేపిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు మనుగడలో ఉంటేనే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు దక్కనున్నాయి. రేషన్ కార్డు పనిచేయకపోతే ఈ పథకానికి నోచుకోలేరు. అలాగే ఈకేవైసీ కూడా తప్పనిసరి. వీటిలో ఏ తేడా వచ్చినా గ్యాస్ సొమ్ము దక్కడం కష్టంగా మారింది.
మొదలైన రాయితీ తిప్పలు
ఉచిత గ్యాస్ సిలెండర్లు పథకం అమల్లో భాగంగా మొదటి విడత పూర్తి అయ్యింది. రెండో విడత ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైంది. గ్యాస్ బుకింగ్ ప్రారంభించి, డెలివరీ కూడా చేస్తున్నారు. ఇందుకు ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఇవన్నీ ఉంటేనే ఈ పథకం అమలు చేస్తున్నారు. అలా గ్యాస్ సరఫరా అయిన వారికి కూడా చేస్తున్నా.. సబ్సిడీ డబ్బులు మాత్రం చాలా మంది ఖాతాలకు జమ కావడం లేదని మహిళలు వాపోతున్నారు.
జిల్లాలో వివరాలు
గ్యాస్ వచ్చింది, డబ్బులు రాలేదు
బుకింగ్ చేసిన కొద్ది రోజులకు వంట గ్యాస్ అయితే వచ్చింది. కానీ డబ్బులు ఇంకా రాలేదు. అడిగితే గాబరా వద్దు.. వస్తాయని సమాధానం చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయని అడిగితే మాత్రం ఈకేవైసీ అయిందా అని ఆరా తీస్తున్నారు. డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పి తప్పించుకుంటున్నారు.
– వరలక్ష్మి, జాలారిపేట, పెదవాల్తేరు
డెలివరీ చేసిన 48 గంటల్లో..
గతంలో మాదిరే గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒక ఎస్ఎంఎస్ లబ్ధిదారు ఫోన్కు వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో 24 గంట్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నాం. డెలివరీ చేసిన 48 గంటల్లో డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుంది.
– వి.భాస్కర్, డీఎస్వో, విశాఖ