● స్మార్ట్ మీటర్లతో మా పొట్ట కొట్టొద్దు ● ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె ● విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన
సీతమ్మధార: ఉద్యోగ భద్రత కల్పించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల విద్యుత్ మీటర్ రీడర్లు డిమాండ్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్కు డిమాండ్ల పత్రం సమర్పించారు. గురుద్వారా వద్ద గల ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయం వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మీటర్ రీడర్లు పాల్గొన్నారు. ఈ ధర్నానుద్దేశించి సంఘ గౌరవ అధ్యక్షుడు బాల కాశీ, ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుతరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడి, అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని, విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలైనా నేటికీ ఆ హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. గత 15, 20 ఏళ్లుగా సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న తమను స్మార్ట్ మీటర్ల పేరుతో రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అదానీ, అంబానీలకు కొమ్ముకాస్తోందని, విద్యుత్ మీటర్ రీడర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు రామకృష్ణ, శివారెడ్డి, క్రాంతికుమార్, ఎస్.కె.రెహమాన్, మన్మధరావు, రామలింగారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, శ్రీనివాస్ శేఖర, చిరంజీవి, శ్రీనివాసరావు, నాగబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ధర్నా చేస్తున్న మీటర్ రీడర్లు