
ఎంటీఎస్ టీచర్స్ ఆగ్రహం
బీచ్రోడ్డు: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లు తమకు నివాస స్థలాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కనీస వేతనంపై సేవలు అందిస్తున్న తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సొంత ప్రాంతాలకు దగ్గరలోనే పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొన్న జీవో నంబర్ 39ను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని టీచర్లు ఆరోపించారు. అతి తక్కువ వేతనంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమ పట్ల కూటమి ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. జీవో 39కు విరుద్ధంగా 60–70 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇవ్వడం దారుణమన్నారు. అతి తక్కువ జీతంతో అంతదూరం వెళ్లి పనిచేయలేమని, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో పోస్టింగ్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఎంటీఎస్ టీచర్లు హెచ్చరించారు.