
ఏఎన్ఎంల ఆందోళన
మహారాణిపేట : పదోన్నతుల జాబితా ప్రకటించడంలో జరుగుతున్న ఆలసత్వాన్ని ఖండిస్తూ రేసపువానిపాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు సోమవారం ఆందోళనకు దిగారు. యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అసోసియేషన్ నాయకురాలు పి.మణి మాట్లాడుతూ సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, డీఎంహెచ్వో ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆరోపించారు. పదోన్నతుల విషయమై డీఎంహెచ్వోకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంహెచ్వో వైఖరి వల్ల ఏఎన్ఎంలు తీవ్రంగా నష్టపోతున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఆందోళనకు దిగామని స్పష్టం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు దేవకి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏఎన్ఎంల పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందని, విశాఖలో మాత్రం జాబితాలు తయారు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు రత్నం, పద్మ, కృష్ణవేణి, సుభాషిని, కుమారి, అలాగే యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు చుక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.