వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు, పవన్‌ అబద్ధపు హామీలపై పెల్లుబికిన యువత ఆగ్రహం జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఇప్పుడు జూన్‌ నెల ముగుస్తోంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. మూడు లక్షల మందిని తీసేశారు ఫీజు రీయింబ | - | Sakshi
Sakshi News home page

వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు, పవన్‌ అబద్ధపు హామీలపై పెల్లుబికిన యువత ఆగ్రహం జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఇప్పుడు జూన్‌ నెల ముగుస్తోంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. మూడు లక్షల మందిని తీసేశారు ఫీజు రీయింబ

Jun 24 2025 4:23 AM | Updated on Jun 24 2025 4:23 AM

వర్షం

వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, వి

మహారాణిపేట : కూటమి ప్రభుత్వ అబద్ధపు హామీలపై యువత కదం తొక్కింది. వర్షానికి సైతం వెరవకుండా గర్జించింది. పెల్లుబికిన యువ గర్జనను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. డౌన్‌ డౌన్‌ చంద్రబాబు అంటూ చేసిన నినాదాలతో కలెక్టరేట్‌ జంక్షన్‌ మార్మోగిపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యువత పోరు కార్యక్రమం హోరెత్తిపోయింది. ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని, ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ యువత పోరు పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనికి జిల్లాలో ఉన్న యువత, నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. వైఎస్సార్‌ సీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది నిరుద్యోగులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా వెరవలేదు. భారీ సంఖ్యలో జనాలు రాకుండా పోలీసులు బారికేడ్లు, రోప్‌పార్టీలతో పద్మవ్యూహం పన్నినా వాటిని బద్దలు కొట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల అబద్ధపు హామీలను ఎండగట్టారు. నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిగ్గదీసి అడిగారు. చంద్రబాబుది మేనిఫెస్టో కాదని, మాయఫెస్టో అని తూర్పారబెట్టారు.

అడ్డుకోవడానికి ప్రయత్నించినా..

యువత పోరులో భాగంగా ముందుగా జిల్లా పరిషత్‌ నుంచి ర్యాలీ చేపట్టారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ.. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా యువత, నిరుద్యోగులు వస్తుండడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. జెడ్పీ నుంచి కలెక్టరేట్‌ లైన్‌లో బారికేడ్లు, రోప్‌ పార్టీలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు తప్పించుకుంటూ కలెక్టర్‌ వరకు ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు.

కూటమి ప్రభుత్వంలో

ముగ్గురికే జాబ్‌లు వచ్చాయి..

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎంగా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌కు, మంత్రిగా లోకేష్‌లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. 2.6 లక్షల మంది వలంటీర్లను, ఎండీయూ వాహనాల్లో పనిచేసే 20 వేల మందిని, లిక్కర్‌ షాపుల్లో పనిచేసే 15 వేల మందిని తొలగించి వారి పొట్టకొట్టిందని గుర్తు చేశారు. జనసేన ప్లీనరీలో ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువత స్వయం ఉపాధికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఒక్కరికి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఇవ్వలేదన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారని, ఇప్పుడు జూన్‌ కూడా దాటిపోతోందని, జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం డీఆర్వో భవానీ శంకర్‌కు వినతిపత్రం అంజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్‌ పరిశీలకుడు కదిరి బాబూరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, మళ్ల విజయ్‌ప్రసాద్‌, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, చింతలపూడి వెంకటరామయ్య డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్‌, యువజన విభాగం ఆధికార ప్రతినిధి మహ్మద్‌ ఇమ్రాన్‌, యువజన విభాగం జోనల్‌ అధ్యక్షుడు అంబటి శైలేష్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా రెడ్డి, నాగేంద్ర, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎక్కువ మంది వచ్చారని కేసు

అల్లిపురం : వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరుకు అనుమతి కంటే ఎక్కువ మంది హాజరయ్యారని.. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మహారాణిపేట సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పబ్లిక్‌ సర్వెంట్‌ విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు, దాడి చేసినందుకు సెక్షన్‌ 132, 121(1), ఎక్కువ మంది గుమిగూడినందుకు 189(2), 191(2), 190 బీఎన్‌ఎస్‌ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, వి1
1/1

వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement