
సచివాలయ ఉద్యోగుల నిరసన
బీచ్రోడ్డు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన సమస్యలతోపాటు, ఆర్థికేతర అంశాలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం 75వ శాఖగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖకు నేటికీ చట్టబద్ధత కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి వదిలేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఈ అంశాన్ని క్యాబినెట్లో చర్చించలేదని విమర్శించారు. తమకు నిర్దిష్టమైన సర్వీస్ రూల్స్ లేవని, అలాగే పదోన్నతి మార్గం కూడా లేదని ఉద్యోగులు వాపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల విధులు నిర్వర్తిస్తున్నా తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలను రద్దు చేసి, ఎక్కడకు పంపిస్తారో చెప్పకుండానే బదిలీలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా పోలీసులు బదిలీల వల్ల నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లు నిండని వారికి, కొత్తగా బదిలీపై వచ్చిన వారికి బదిలీ ఆప్షన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, తొమ్మిది నెలల ఎరియర్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో నిరసనలను వివిధ రూపాల్లో కొనసాగిస్తామని, ప్రజా స్పందన కార్యక్రమాల్లోనూ తమ అర్జీలను ప్రభుత్వానికి తెలిసేలా సమర్పిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’, ‘ప్రమోషన్ ఫస్ట్ – ట్రాన్స్ ఫర్ నెక్ట్స్ వంటి నినాదాలతో వారు ఆందోళనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.