● తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్
జంగా రాఘవరెడ్డి
● కొడంగల్ రైతులకు
ఖమ్మం జిల్లాలో శిక్షణ కార్యక్రమం
● పాల్గొన్న కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి
దుద్యాల్: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, సాగు కూడా సులవని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీలను వివరించారు. కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల నుంచి వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి మాట్లాడారు. కొడంగల్ రైతులు ఆయిల్ పామ్ సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ పంట సాగుతో స్థిరమైన ఆదాయం పొందచ్చని తెలిపారు. అనంతరం అధికారులు సాగు విధానం గురించి అవగాహన కల్పించారు. చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత దూరం ఉండాలి, ఎన్ని సంవత్సరాల పాటు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు, ఏయే పంటలు వేసుకోవచ్చు అనే విషయాలను క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో కొడంగల్ డివిజన్ హార్టీకల్చర్ అధికారి సురేంద్రనాథ్, విస్తరణ అధికారి బాబ్యానాయక్, వ్యవసాయ విస్తరణ అధికారులు జ్యోతి, లోకేశ్, దేవేందర్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ దుద్యాల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, యూత్ విభాగం మండల అధ్యక్షుడు మెరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


